Monday, August 24, 2009

రుషులూ -- యోగులూ..

చెలం "వేదాంతం" నుంచి ఒక కథ.


పూర్వకాలం రుషులు, యోగులూ కావటం చాలా సుఖం గా వున్నట్లు కనపడుతుంది. యోగ్యత వుండాలి కాని చిన్నతనం లో ఆశ్రమం లో భోజనం అది జరిగిపోయేది తరవాత సొంత రిసెర్చి కోసం ఆశ్రమాలు స్తాపించుకునే వారు. ఈ శిష్యులు గురువులు గా తయారై, గొడ్లని కాయటం, బట్టలు వుతకటం, వూడవటం, అలకటం, వంటా అంతా శిష్యులు చేసి పెట్టే వారు. రాజాశ్రయం వల్ల తిండి జరిగి పోయేది. ఇప్పటి కవుల మల్లేనే సమితులు గా, యూనివర్సిటీ ల కింద ఏర్పడి ఎవరి అన్వేషణా ఫలితాలను వారు నివేదించుకునే వారు వార్షికోత్సవాలలో.

అంతే కాక రాజులు సభ చేసినప్పుడల్లా అవి ఇవీ గట్టిగా చదివి బహుమానాలు అవి పొందేవారు. యజ్ఞాలకు యాగాలకు వీళ్ళందరు కూడేరంటే సులభం గా లక్ష ఆవులు, ఏనుగులు, లెక్కలేని ధనాలు సంభావనలు దొరికేవి. ఆ బహుమతులను ఏం చేసుకునే వారా, ఎక్కడ దాచుకునే వారా మరి లక్ష ఆవులను ఏ సంతలోనో అమ్ముకుంటే కొనే వారెవరా అనిపిస్తుంది. ఆనాటి బంగారం, రత్నాలు, విరాళాలు వింటే ఈనాటి యుద్ధ కాలపు కరెన్సీ కు ఈ గతి పట్టి వుండదా అని సందేహం వస్తుంది. కొందరికి వుద్యోగాలు అవి కూడా అయ్యేవి, రాజుల దగ్గర పురోహితులు మొదలైనవి. పెళ్ళిళ్ళూ చేసుకోవచ్చూ, సంసారాలు వుండవచ్చూ, అదీ కాక తీవ్ర తపస్సు చేసి ఏదేవినో వేస్య నో రప్పించి , విసుగు పుట్టగానే సులభం గా వైరాగ్యం లోకి పోయి, ఆమెను మళ్ళీ ఆమె స్వస్తలానికి ఏ అపవాదు లేకుండా పంపెయ్యవచ్చు. చచ్చిన తరువాత వీళ్ళకు ఇంద్రుడి దగ్గరో, బ్రహ్మ దగ్గరో సీట్లు రిజర్వు అయ్యి వుండేవి.


ఇంత సుఖం లోను వీళ్ళకో పెద్ద బాధ వుంది. వీళ్ళు నివసించే అడవులే రాక్షసులకు కూడా నివాస స్తలాలు. చాలా త్వరలో రాక్షసులు వీళ్ళ రుచి మరిగేరు. ఆ పూటకు కూర దొరక్క పోతే అట్టా షికారుకు పోయి ఒక రుషి ని తెచ్చి తరుక్కుని తినే వారు. ఈ రుషులకు యోగులకు రక్షణ అల్లా శాప దక్షత. కాని వేటగాళ్ళకు మల్లే శాపం తీసే వ్యవధి నివ్వకుండానే వీళ్ళని గొంతు నులిమేసే వారుగావును, ఆ రాక్షసులు. రాక్షస పల్లె లో ఓ రాక్షసాంగన ఇంకో రాక్షసాంగనతో


" ఏం కూరమ్మా మీ ఇంటో?" అంటే
"వంకాయ మునీశ్వరుడు" అంటుంది ఆమె


" మీ ఇంటో ఏం కూరమ్మా" అంటే,
"యోగి వేపుడు" అంటుంది రెండో ఆమె.


ఇంతలో మూడో ఆమె వచ్చి " ఇవాళ ఎవరి మొహం చూశేరో, మా ఆయనకి ఏం దొరక లేదమ్మా. గురువుకి ఆకులు కోస్తూ వుండగా ఇద్దరు బక్క శిష్యులు దొరికేరు. చట్టి అడుగున అంటుకుపోయింది కూర" అంటుంది. " యోగులు దొరికితే సులభమమ్మా, ఈ రుషుల ఈకెలు పీకేప్పటికి చేతులు పడిపోతున్నాయి." అంటుంది మొదటి ఆమె.


కాని ఈ రుషులు యోగులూ చాలా సార్లు కాటు వెయ్యనే వేసే వారు.


" మీ ఆయన ఏరమ్మా కనపడటం లేదంటే" " ఏమోనమ్మా, మా అబ్బయి పెద్ద కోరమొలిచిన పండక్కి ఓ బతికిన యోగి ని తెమ్మన్నాను, పలావు వండుదామని. ఏమైనారో, రెండువేల ఏళ్ళయ్యింది. ఇంకా రాలేదు" అంటుంది.
"మొన్న సాయింత్రం మీ ఇంటి చుట్టూ మూలుగుతూ ఓ పెద్ద పులి తిరుగుతోంది. అది మీ ఆయనేమో అనిపించింది. ఆయనమల్లే వెనక్కాలు కుంటుతోంది" అంటూంది రెండో ఆమె.


ఇది వింటున్న మూడో ఆమె రంగం మీదకు వచ్చి,
"అంతేనమ్మా మా చెల్లెలి మొగుడు అట్లానే ఓ యోగిని పట్టటానికి వెళ్లి మళ్ళీ రాలేదు. సాయింత్రానికి ఓ పెద్ద కొండసిలవచ్చి ఆమె కాళ్ళను చుట్టేసుకుంది. ఆమే కేకలు పెడితే చంపడానికి వెళ్ళాం. తీరా దగ్గరికి వెడితే కొండసిలవకి పెద్ద మీసాలు. వాటిని చూసి గుర్తుపట్టాం మా మరిది అని" అంటూంది.


ఇంతలో ఇంకో ఆమె --
"అంతకన్నా చిత్రం, మా మరదలు సంగతి , అది నీళ్ళాడింది. పత్యానికని దాని మొగుడు బాలముని కోసమని పోయి మాయమైనాడు.ఆరువేల ఏళ్ళకీ తిరిగి రాలేదు. తిండికి జరక్క మా తమ్ముళ్ళే చేసుకుంది. చేసుకున్న వెయ్యేళ్ళకే ప్రత్యక్షమైనాడు.ఓ నాటి రాత్రి వాళ్ళ మంచం కింద కన్నం లోంచి "చూస్తున్నాలే నీ పోకిల్లు" అన్నాడు దాని కొప్పు పట్టుకుని, ఎట్లా చూసేవంటే, నువ్వు వాళ్ళి కావలించుకున్నప్పుడల్లా మీ కాళ్ళ సందున కిచ కిచ మనే చుంచు ఎవరనుకున్నావు, నేనే. ఆ బాల యోగి వెధవ, కుత్తుక నులుముతుండగా, "చుంచువవు అన్నాడు" అని యేడ్చాడు.


మొత్తానికి ఈ యోగులు, రుషులు ఈ రాక్షసుల అవసరాలకు లోకువైనారు. భారతీయ యుద్ధం లో 18 అక్షోణీలు ఎందుకు గుమి గూడేరో తెలీదు. ఈ పెద్ద వీరుల చేతుల తీట వొదిలేట్టు చంపుకోడానికి తప్ప వాళ్ళు చేసిన ఒక్క పని లేదు. భీష్ముడి ఆగ్నేయాస్త్రానికి ఇటు అర్ధ లక్షా, భీముడి గదా ఘాతానికి అటు ఓ లక్షా చావటం ఒక్కటే వాళ్ళకు నియమించిన ధర్మం. అట్లానే ఆటం బాంబు కింద ఆవిరి కావటం తప్ప తక్కిన వివరాలు ఏమి తెలీవు నాగసీకా ప్రజల గురించి. ఈ యోగులు కొన్ని లక్షలు కోట్లు వరస గా ధ్వంసమవుతునే వచ్చారు. కాని ఆ అధ్యాత్మిక మధువు ఎట్లాంటిదంటే ఎన్ని ఎలుగుబంట్లు దోచుకున్నా మళ్ళీ ఆశ్రమ పట్లు పెడుతూనే వుంటారు. దాని వల్ల ఒక అవతారం, ఆ అవతారం పుట్టినపుడూ, చచ్చినప్పుడూ మధ్య మధ్యా స్తుతులకీ, ఆరాధనకి, దండకాలు చదవటానికి, వీళ్ళు హాజరౌతూ వుంటారు. ఈ లోపల వీళ్ళనెవరు భోజనానికి వుపయోగించుకోక పోతే , వీళ్ళకు కొవ్వు లేక పోతే వీళ్ళను బలిపించటానికి కొన్ని ఏళ్ళు కంద మూలాలను తెచ్చి వీళ్ళ ఆశ్రమాల ముందు పడేస్తో వుండవొచ్చు, ఈ రాక్షసులు.


సౌరిస్ అంటుంది ఈ ఆర్యులు కూడా జన సంఖ్య ఎక్కువై ఇంగ్లీషు వాళ్ళ పద్దతి మీదే వ్యాప్తి చెందేరని. ఈ రుషులు పోయి అనార్యుల దేశాల్లో ఆశ్రమాలు పెట్టుకున్నారు, ఆర్యావర్తం అడవుల్లో ఆశ్రమాలు ఎక్కువై సందులేక. మరి ఈ అనార్యులు వూరుకుంటారా? వీళ్ళను వండుకు తింటారు, వూరగాయలు పెట్టుకుంటారు. అదుగో మా రుషుల్ని హింసిస్తున్నారని వంక పెట్టి ఆర్య రాజులు ఈ అనార్యుల మీదకు దండెత్తీ వోడించి రాజ్యాలను ఆక్ర మించుకుని ఆర్యులకు చోటు చేసి, మతమూ, తమ నాగరికతా ప్రవేశ పెట్టేరు. ఆర్య కవులు ఆ అనార్యులను అనాగరికులనీ, మనుష్య భక్షకులనీ, రాక్షసులనీ, మాయావులు, పది, ఇరవై తలల వాళ్ళనీ వర్నించి, తమ రాజులను పొగిడి అక్షర లక్షలు సంపాయించే వాళ్ళు...


ఇవీ పురాణ గాధలన్నీ..

6 comments:

  1. అబ్బా! కొడితే ఇలా చలం లాగా కొట్టాలి.

    ReplyDelete
  2. verry veyyi rakaalu

    ReplyDelete
  3. @ మహేష్: చలం ఎప్పుడూ మాములు పంధా కు డిఫరెంట్ గా వుంటారు కదా.. ఆయన్ చేసే ఏ పైనైనా అంతే మరి. నేను మొదటి సారి ఈ కధ చదివినప్పుడూ ఆయన సునిశితమైన హాస్యపు తీరుకు బాగా నవ్వు కున్నా. ధన్య వాదాలు.

    @అనానిమస్ : నిస్సందేహం గా నండి. :-) ధన్య వాదాలు.

    ReplyDelete
  4. చలం లో ఎన్నో పార్శ్వాలు.
    పూల గూర్చి, స్త్రీల గూర్చి, బిడ్డల గూర్చి రాసే ప్రేమ పూరిత మైన చలం నాకు చాలా ఇష్టం.

    తనను తాను తెలుసుకొన్న అరుణాచల చలం కూడా నాకు ఇష్టం.

    ప్రపంచం తో దెబ్బలు తిని దాని ప్రభావం వల్ల, ఇంగ్లీష్ చదువు కొలువు వల్ల, ఆ రోజుల్లోని extremist ఆలోచనల వల్ల సమాజం పై విషం కక్కే చలం నాకు నచ్చరు.

    ReplyDelete
  5. తప్పకుండా మైత్రేయి. అందరం ఎంత డిఫరెంటో మన ఆలోచనలు కూడా అంతే కదా.. నాకు చలం లో అన్ని పార్శ్వాలు ఇష్టమే. ఆయన ఆలోచనలలో నాకు ఎక్స్ట్రి మిజం కనపడదు. అన్నీ మధురమే వుంటే ఎలా చెప్పండి అప్పుడు అప్పుడు అవి జీర్ణం కావటానికి తాంబూలం కూడా తప్పనిసరి మరి. ఇది నా అభిప్రాయమే సుమా. ధన్యవాదాలు.

    ReplyDelete
  6. చాలా బాగుందండీ

    ReplyDelete